
హాలీవుడ్ నటి జో సల్దానా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నటించిన నటిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్: ఫైర్ అండ్ యాష్ బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న భారీ విజయమే ఈ చరిత్రాత్మక ఘనతకు కారణంగా నిలిచింది.
ఈ రికార్డు ఇప్పటివరకు బ్లాక్ విడో ఫేం స్కార్లెట్ జోహాన్సన్ పేరిట ఉండేది. అయితే 2026 జనవరి 14 నాటికి వెల్లడైన గణాంకాల ప్రకారం, జో సల్దానా నటించిన సినిమాల మొత్తం ప్రపంచ వసూళ్లు 15.47 బిలియన్ డాలర్లను దాటడంతో ఆమె అగ్రస్థానానికి చేరుకున్నారు.
ఇంకా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన నాలుగు సినిమాల్లో నటించిన ఏకైక నటి కూడా జో సల్దానానే. ఆ సినిమాలు అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్, అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్: ఎండ్గేమ్. ఈ నాలుగు బ్లాక్బస్టర్లలో కీలక పాత్రలు పోషించడం ద్వారా ఆమె ఈ అరుదైన ఘనతను సాధించారు.
ఇటీవల విడుదలైన అవతార్: ఫైర్ అండ్ యాష్ కేవలం నాలుగు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1.23 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. భారత్లో కూడా ఈ చిత్రం మంచి స్పందన పొందుతూ ఇప్పటివరకు దాదాపు రూ.221 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
జో సల్దానా విజయానికి ప్రధాన కారణం ఆమె భాగమైన భారీ ఫ్రాంచైజీలే. హాలీవుడ్లోని మూడు అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఆమె కీలక పాత్రలు పోషించారు. అవతార్ సిరీస్లో నేతిరి, మార్వెల్ ఎంసీయూలో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ చిత్రాల్లో గమోరా, అలాగే స్టార్ ట్రెక్ సిరీస్లో ఉహురా పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించారు.
ఈ చారిత్రాత్మక విజయానంతరం జో సల్దానా ఎంతో ఉత్సాహంగా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఒక భావోద్వేగ వీడియోను షేర్ చేస్తూ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా దర్శకులు జేమ్స్ కామెరూన్, జేజే అబ్రామ్స్, రూసో బ్రదర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ, ఈ ప్రయాణం తన జీవితంలో మరిచిపోలేని అనుభవమని పేర్కొన్నారు.
Recent Random Post:















