సినిమా ఇండస్ట్రీ అంటేనే కలల ప్రపంచం. ఎవరి జీవిత ప్రయాణం ఎలా మలుపు తిరుగుతుందో ఎప్పటికీ చెప్పలేం. దర్శకుడిగా మారాలనుకునే వారు నటులవుతారు, నటుడు కావాలనుకునేవారు దర్శకులవుతారు. ఇదే ప్రాసెస్లో ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం జరిగింది. కోలీవుడ్ లోక్బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు నటుడిగా మారేందుకు సిద్ధమవుతున్నాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే శ్రుతి హాసన్తో కలిసి ఓ యాడ్ షూట్లో కనిపించిన లోకేష్, అందులోని రొమాంటిక్ పర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇది చూసిన వాళ్లంతా ‘లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా?’ అని ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు, ‘కెప్టెన్ మిల్లర్’ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, లోకేష్ను హీరోగా తీసుకుని సినిమా తీయబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇద్దరూ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.
లోకేష్ ఇప్పటికే “పది సినిమాల తర్వాత దర్శకత్వానికి గుడ్బై చెబుతాను” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాను అసలు మనసులో పెట్టుకున్న కల నెరవేర్చేందుకే ఆ నిర్ణయం తీసుకున్నాడా? అనే ప్రశ్నలు అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఊగిపోతున్నాయి.
తాజాగా యాడ్లో, ఇప్పుడు హీరోగా — ఈ పరిణామాలు లోకేష్లోని కొత్త కోణాన్ని వెలుగులోకి తెస్తున్నాయి. ప్రస్తుతం అతని నటన పట్ల ఆసక్తి పెరుగుతున్న వేళ, లోకేష్ నుండి డైరెక్షన్ కాకుండా యాక్టింగ్ హంగామా చూడబోతున్నామా? వేచి చూడాల్సిందే.
Recent Random Post: