
కొవిడ్ సమయంలో సినీ పరిశ్రమలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, మలయాళ ఇండస్ట్రీ కూడా అప్పట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కొవిడ్ అనంతరం ఆ పరిశ్రమకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ విపరీతమైన ఉత్సాహాన్ని పొందాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రేక్షకులు ఓటీటీలను ఆదరించడం వల్ల, మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో మంచి మార్కెట్ ఏర్పడింది.
ఇందుకు ప్రధాన కారణం కొవిడ్ సమయంలో నేరుగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో విడుదలైన మలయాళ సినిమాలు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందడం. ఆ జాబితాలో మోహన్లాల్ నటించిన బ్రో డాడీ ఒకటి. నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ, బ్రో డాడీ షూటింగ్ మొత్తం హైదరాబాద్లోనే పూర్తి చేసినట్లు వెల్లడించాడు.
అప్పట్లో ఖాళీగా ఉన్న సమయంలో అనుకోకుండా ఈ సినిమాను ప్రారంభించానని, ఇది మోహన్లాల్తో సినిమా చేయాలనే ఆలోచనతో పుట్టిన ప్రాజెక్టు కాదని స్పష్టం చేశాడు. ఇద్దరు రచయితలు తమ దగ్గర మంచి కథ ఉందని చెప్పడంతో, వినగానే కథ నచ్చి హక్కులు తీసుకున్నానని వివరించాడు. మోహన్లాల్తో తరచూ కలుస్తుండటంతో, ఆ కథపై చర్చలు జరిగాయని తెలిపాడు.
కరోనా సమయంలో ఇతర రాష్ట్రాల్లో షూటింగ్లకు అనుమతులు లభించినప్పటికీ, కేరళలో ఆ అవకాశం లేకపోవడంతో తక్కువ బృందంతో హైదరాబాద్లోనే షూటింగ్ పూర్తి చేసినట్లు చెప్పాడు. అనుకోకుండా తీసిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందించిందని, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను చేరుకున్నట్లు వెల్లడించాడు.
Recent Random Post:















