మళ్లీ టాలీవుడ్ వైపు పూజా హెగ్డే… నాని–సుజీత్ కాంబినేషన్‌తో రీ ఎంట్రీ?

Share


తెలుగు ప్రేక్షకులకు పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుట్టబొమ్మ అంటూ లక్షలాది మంది అభిమానుల మనసులు గెలిచిన పూజా, ఒక దశలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా ఆమె తెలుగులో కనిపించకపోవడం అభిమానులను నిరాశపరిచిన విషయం.

అల వైకుంఠపురములో సినిమా తర్వాత తెలుగులో పూజాకు చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా పడలేదు. ఆ సినిమాతో స్టార్‌డమ్ అందుకున్న పూజా, ఆ తర్వాత చేసిన ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఆచార్య లాంటి మెగా ప్రాజెక్ట్‌లో నటించినప్పటికీ, ఆ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ముఖ్యంగా రాధే శ్యామ్ తర్వాత పూజాకు తెలుగులో ఆఫర్లు గణనీయంగా తగ్గిపోయాయి.

ఈ పరిస్థితుల్లో పూజా తన ఫోకస్‌ను ఇతర భాషలపైకి మళ్లించారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు వచ్చినప్పటికీ, అక్కడ కూడా ఫలితాలు ఆమెకు కలిసి రాలేదు. సినిమాలు ఫ్లాప్ అయినా గ్లామర్ ఇండస్ట్రీలో పూజా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోల ప్రాజెక్టుల చర్చల్లో ఆమె పేరు తరచూ వినిపిస్తూనే ఉంది.

బాలీవుడ్‌లో ఆశించిన బ్రేక్ రాకపోయినా, కోలీవుడ్‌లో అయినా లక్ కలిసి వస్తుందేమో అన్న ఆశతో చేసిన ప్రయత్నాలు కూడా అంతగా వర్కౌట్ కాలేదు. భారీ అంచనాలతో వచ్చిన రెట్రో సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయినప్పటికీ పూజాకు తమిళంలో అవకాశాల కొరత మాత్రం లేదు. కూలీ సినిమాలో ‘మోనికా’ స్పెషల్ సాంగ్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న పూజా, ప్రస్తుతం జననాయగన్ రిలీజ్‌కు రెడీగా ఉంది. అంతేకాదు కాంచన 4లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఓ వైపు తమిళంలో వరుస ప్రాజెక్టులు చేస్తూనే, మరో వైపు మళ్లీ టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు పూజా. ఇప్పటికే దుల్కర్ సల్మాన్ సరసన ఒక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమైన ఆమెకు, తాజాగా మరో ఆసక్తికర ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించనున్నారన్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో బిజీగా ఉన్న నాని, ఆ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ వెంటనే, జూన్ చివర్లో లేదా జూలై మొదటి వారంలోనే నాని–సుజీత్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

సాధారణంగా నాని తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లపై ఎక్కువగా దృష్టి పెట్టరు. కథకు సరిపోయే పాత్ర ఉంటే చాలు అన్నదే ఆయన విధానం. అలాంటిది పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డేతో సినిమా అంటే, ఈ కాంబినేషన్‌పై సహజంగానే ఆసక్తి పెరిగింది. ఆన్‌స్క్రీన్‌పై వీరిద్దరి జోడీ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి, కొంతకాలం పాటు తెలుగులో అవకాశాల్లేక వెనకబడిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవ్వడం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ కొత్త అవకాశాలు పూజాకు మళ్లీ పాత గ్లోరీని తెచ్చిపెడతాయా లేదా అన్నది వేచి చూడాలి.


Recent Random Post: