అయ్యో పాపం వీరాభిమాని: బాలయ్య మళ్ళీ కొట్టిండు.!

నందమూరి బాలకృష్ణ ని ఎవరన్నా అభిమానిస్తే అదొక పెద్ద నేరంగా తయారవుతోంది. ‘బాలయ్యతో చెంప దెబ్బ తిన్నా అది భలేగా వుంటుంది..’ అని ఓ దర్శకుడు, బాలయ్యతో అవసరార్థం డైలాగు చెప్పాడుగానీ, దెబ్బ తిన్నోడికే ఆ దెబ్బ తాలూకు నొప్పి ఏంటో తెలుస్తుంది.

తాజాగా మరో బాలయ్య అభిమాని ‘చెంప దెబ్బ’ తినేశాడు తన అభిమాన హీరో చేతిలో. సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్య, తన ఫొటో తీస్తోన్న ఓ అభిమాని మీద దాడి చేశారు. ‘అందులో పొటోల్ని ఎరేజ్ చేసెయ్..’ అంటూ హుకూం జారీ చేశాడు బాలయ్య.

సినీ నటుడిగా బాలయ్య ఈ పని చేసినా, అది క్షమించరాని నేరం. అలాంటిది, ప్రజా ప్రతినిథిగా ఓ వ్యక్తి మీద భౌతిక దాడి చేశాడంటే.. ఎమ్మెల్యే పదవిలో బాలయ్య వుండడానికి అనర్హుడు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అయితే, బాలయ్య కొట్టుడు.. అభిమానులకు కొత్తేమీ కాదు. బాలయ్య కొడతాడని తెలిసి కొందరు దూరంగా వుంటారు. కొందరు మాత్రం బలైపోతుంటారు.

తమ అభిమాన నటీనటులు, రాజకీయ నాయకులు, ఇతర సెలబ్రిటీలు కనిపిస్తే, వారితో ఓ సెల్ఫీ తీసుకోవాలని ఎవరికి మాత్రం వుండదు. బాలయ్య ముందు మాత్రం ఇలాంటి ‘ఆనందాలు’ పొందాలని చూస్తే కష్టం. బాలయ్యకు చిర్రెత్తుకొచ్చేస్తుంటుంది.. ఫోన్లు పగిలిపోతాయ్.. కెమెరాలూ పగిలిపోతాయ్.. చెంపల సంగతి సరే సరి.

బాలయ్యతో పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా అభిమానులకు దబడి దిబిడే. నిజానికి బాలయ్యది ఫ్రస్ట్రేషన్. అభిమానుల్ని చూస్తే మనసు నిమ్మళంగా మారాలి. సంతోషపడాలి. కానీ, బాలయ్యకు పూనకం వచ్చేస్తుంటుంది. అదే అసలు సమస్య. ‘బాలయ్య మానసిక పరిస్థితి’పై ఎప్పటికప్పుడు అనుమానాలు వ్యక్తమవుతుంటాయంటే కారణం ఇలాంటి సంఘటనలే.

ఇక, రాజకీయాల విషయానికొస్తే, జగన్ సర్కారుపై బాలయ్య విరుచుకుపడిపోతున్నారు. దానికి వైసీపీ నుంచి కూడా గట్టిగా కౌంటర్లు పడిపోతున్నాయి. ‘బాలయ్య ఆటలో అరటిపండు’ అనేశారు తాజాగా మంత్రి కొడాలి నాని. ఆటలో అరటిపండు కాదు.. అటలో అవివేకి.. అని తాజా చెంప దెబ్బ ఎపిసోడ్‌తో అందరికీ ఇంకోసారి అర్థమయిపోయింది.


Recent Random Post: