మేమే గెలిచాం.. షర్మిలకు జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 2,723 పంచాయతీల్లో 1,055 గెలుచుకున్నాం. ఫలితాలపై వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. విశ్వసనీయతపై మాట్లాడే జగన్.. షర్మిల ఎపిసోడ్‍పై సమాధానం చెప్పాలి. జగనన్న బాణం ఇప్పుడు ఏమైంది. ఇంట్లో వాళ్లకే జగన్ వెన్నుపోటు పొడిచాడు. 20 నెలల పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేశారు’.

‘94 శాతం గెలిచామని ఓ మంత్రి గాలి కబుర్లు చెప్పారు. పంచాయతీల్లో 38 శాతం టీడీపీకి వచ్చాయి. టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు. టీడీపీని తక్కువగా అంచనా వేస్తే ప్రజలు వదిలిపెట్టరు. పోలీసులు రెండు పార్టీలను సమానంగా చూడరా? – ఐఏఎస్, ఐపీఎస్‍లను బ్లాక్‍లిస్ట్ లో పెడతామని బెదిరిస్తారా? పంచాయతీ ఎన్నికల కోసం కొత్త చట్టం తీసుకొచ్చారు. మీ ఇష్టానుసారం నల్ల చట్టాలను తెస్తే చూస్తూ ఊరుకోం. పుంగనూరులో 40 నామినేషన్లు వేస్తే అన్నింటిని రిజెక్ట్ చేశారు. పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్లలో బలవంతపు ఏకగ్రీవాలు చేశారు. బలవంతపు ఏకగ్రీవాలన్నింటిపై కేసు వేస్తాం. గెలిచిన పంచాయతీల్లో చాలా చోట్ల ఫలితం తారుమారు చేశారు. ఎన్నికల్లో ప్రతి అక్రమంపై కేసులు వేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం’.

‘టీడీపీ ప్రజల గుండెల్లో ఉంది. దుర్మార్గులకు వంత పాడితే ఎలా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. వందల పంచాయతీల్లో మేం గెలిస్తే ఏకపక్షంగా ఫలితాలు ప్రకటిస్తారా? అచ్చెన్నాయుడు బెదిరించారంటూ హత్యాయత్నం కేసు పెట్టారు. ఎమ్మెల్యే బెదిరిస్తే వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రపై కేసు పెడతారా? రాష్ట్ర వ్యాప్తంగా 174 అక్రమ కేసులు పెట్టారు. టీడీపీపై ఏకపక్షంగా కేసులు పెట్టారు. తప్పు చేసిన ఏ వ్యక్తికైనా శిక్ష తప్పదు. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. బలవంతపు ఏకగ్రీవాల కోసం మా పార్టీ కార్యకర్తలను బెదిరించారు. ఎన్నికలను మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని రణరంగంగా మార్చారు’ అని అన్నారు.


Recent Random Post: