
ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న కృతి శెట్టి, ఆ తర్వాత చేసిన సినిమాలతో ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోయింది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి చిత్రాలు మొదట్లో బజ్ తెచ్చిపెట్టినా, ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ ఆమె కెరీర్ గ్రాఫ్ను పడిపోయేలా చేశాయి. చివరిగా మనమే సినిమాలో శర్వానంద్తో చేసిన ప్రయత్నం కూడా ఆడియన్స్ను పెద్దగా ఆకట్టుకోలేదు. బేబమ్మగా పాపులారిటీ తెచ్చుకున్నా కూడా, కృతికి సరైన ఛాన్స్లు రాకపోవడం గమనార్హం.
తెలుగులో అవకాశాలు తగ్గడంతో, కృతి ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీపై దృష్టి సారించింది. రవి మోహన్తో చేసిన జినీ సినిమా ఏడాది క్రితమే పూర్తయినా ఇంకా రిలీజ్ కాలేదు. అయితే ఈ డిసెంబర్లో ఆ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథన్తో ఎల్.ఐ.కె అనే సినిమా కూడా పూర్తి చేసింది. అసలైతే ఆ సినిమా దీపావళికే విడుదల కావాల్సింది కానీ డ్యూడ్ సినిమా రిలీజ్ కారణంగా వాయిదా పడింది.
డ్యూడ్ భారీ హిట్ కావడంతో, కృతి ఇప్పుడు ఎల్.ఐ.కెపై అన్ని హోప్స్ పెట్టుకుంది. ప్రదీప్ సినిమాలు తెలుగులో కూడా మంచి బజ్ సృష్టిస్తున్నాయి కాబట్టి, కృతీ కూడా తిరిగి టాలీవుడ్లో మళ్లీ చర్చలోకి రావాలని చూస్తోంది. ప్రస్తుతం తాను సరైన ప్రాజెక్ట్ దొరకే వరకు గ్లామర్ గేమ్ను వదలకుండా సోషల్ మీడియాలో ఆకర్షణీయమైన ఫోటోషూట్స్తో దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫోటోషూట్స్ వల్ల నేరుగా అవకాశాలు వస్తాయా అన్నది స్పష్టంగా చెప్పలేము కానీ, గ్లామర్ ఆకర్షణ అనేది చాలా మంది హీరోయిన్స్కి కెరీర్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది. జినీ మరియు ఎల్.ఐ.కె రెండూ డిసెంబర్ రిలీజ్ టార్గెట్తో సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే, కోలీవుడ్లో అయినా కృతి బిజీ హీరోయిన్గా మారే అవకాశం ఉంది.
అయితే కృతి శెట్టి మొదట ఉప్పెన హిట్ తర్వాత చేసిన ప్రతి సినిమా అంగీకరించకుండా, కాస్త ఆచితూచి స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకుని ఉంటే, ఈ స్థితి వచ్చేది కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆమెకు డిసెంబర్ నెల చాలా కీలకం కానుంది.
Recent Random Post:














