
బాలీవుడ్లో బాక్సాఫీస్ సునామిగా మారిన విక్కీ కౌశల్ ‘చావా’ ఇప్పటికే ₹300 కోట్ల మార్కును దాటి, ₹500 కోట్ల వైపు దూసుకెళుతోంది. వసూళ్ల దూకుడు చూస్తే మరికొన్ని రోజుల్లో ఈ మైలురాయి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఇతర భాషల ప్రేక్షకుల నుంచి డబ్బింగ్ వెర్షన్లపై భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు మేకర్స్ ఆ దిశగా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.
ఇప్పుడే అభిమానులకు కిక్కిచ్చే వార్త బయటకొచ్చింది. ఫైనల్గా తెలుగు ప్రేక్షకుల కోరికను తీర్చేందుకు ‘చావా’ తెలుగు వెర్షన్ను మార్చి 7న గీతా ఆర్ట్స్ ద్వారా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. గతంలో ‘కాంతార’ని తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈ సంస్థ, ‘చావా’ను కూడా మంచి థియేటర్ కౌంట్తో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
అయితే, మూడో వారం విడుదల కాబట్టి బిగ్ స్కేల్ వసూళ్లను ఆశించడం కష్టం. కానీ ప్రేక్షకులు సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. టాలీవుడ్లో ఇదివరకు వచ్చిన హిస్టారికల్ సినిమాలు ‘సైరా’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘రుద్రమదేవి’ మంచి విజయాలను సాధించినా, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టే స్థాయిలో కాకపోయాయి. పైగా అవి తెలుగువారికి దగ్గరైన కథలు. మరి మరాఠా వీరుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు స్వీకరిస్తారో చూడాలి.
ఇప్పటికే ‘చావా’ హిందీ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యమైన ఏరియాల్లో టాప్-గ్రాస్ కలెక్షన్లు వస్తున్నాయి. ఇక తెలుగు వెర్షన్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నా, సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పబోతున్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, అందులో నిజం ఏమీలేదని క్లారిటీ వచ్చింది. మరోవైపు, రష్మిక మందన్న తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికీ టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతున్న ‘చావా’ పదమూడు రోజుల తర్వాత కూడా ట్రెండింగ్లో కొనసాగుతోంది. మరి విక్కీ కౌశల్ని స్టార్ లీగ్లోకి తీసుకెళ్లిన ఈ చిత్రం, తెలుగులో ఏ స్థాయిలో దూసుకుపోతుందో చూడాలి!
Recent Random Post:















