సంయుక్త బాలీవుడ్ ఎంట్రీ… కాజోల్ కూతురిగా ఛాన్స్!

Share


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద కరోనా పరిస్థితుల మధ్య విడుదలైనా భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే మలయాళ భామ సంయుక్త మీనన్ తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన క‌ళ్యాణ్ రామ్‌ ‘బింబిసార’, ధనుష్ ‘సార్’, సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాలు వరుస విజయాలు సాధించాయి. దీంతో తెలుగు ఇండస్ట్రీలో సంయుక్త క్రేజీ హీరోయిన్‌గా ఎదిగింది.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అఖండ 2’లో కీలక పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా నిఖిల్‌తో ‘స్వయంభు’లోనూ ఆమె నటిస్తోంది. తాజాగా సంయుక్త మరో సెన్సేషనల్ ఛాన్స్ దక్కించుకుంది. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో సంయుక్త నటించబోతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా, తాబు మరో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి.

ఇవన్నీ సరే, కానీ సంయుక్త ఇప్పుడు మరో పెద్ద స్టెప్‌కి రెడీ అవుతోంది. అదే బాలీవుడ్ ఎంట్రీ. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన రెండో ఇన్నింగ్స్‌ను జోష్‌గా సాగిస్తున్న కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే కాజోల్ మరో పవర్‌ఫుల్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమా పేరు ‘మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ చిత్రంతో తెలుగు యువ దర్శకుడు చంద్రన్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభుదేవా, నసీరుద్దీన్ షా, జిస్సు సేన్‌గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కాజోల్ కుమార్తెగా సంయుక్త మీనన్ కనిపించనుండటం విశేషం. బాలీవుడ్‌లో ఇది సంయుక్తకు గ్రాండ్ లాంచ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ఒక్కదానికొకటి లేని పాత్రలు, విభిన్న భాషల్లో సినిమాలు, క్రేజీ అవకాశాలతో సంయుక్త మీనన్ కెరీర్ ఉద్ధరంగా సాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో ఆమె పరిధి మరింత విస్తరించనుంది.


Recent Random Post: