
మలయాళ సినీ ఇండస్ట్రీలో ఘన విజయాలను నమోదు చేసిన మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఎల్ 2: ఎంపురాన్” చిత్రంపై వివాదం చెలరేగింది. ఈ చిత్రంలో హిందుత్వాన్ని వ్యతిరేకించే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్ఎస్ఎస్ నాయకులు, హిందూ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో హిందుత్వంపై వివాదాస్పదంగా వ్యాఖ్యానించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అంశంపై హిందూ సంఘాలు సినిమాను తిరిగి సమీక్షించాలని, హిందుత్వ వ్యతిరేక సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా వారు పట్టుబడుతున్నారు. వివాదం తీవ్రమవుతున్న నేపథ్యంలో పృథ్వీరాజ్ మీడియా ముందుకు వచ్చినప్పటికీ, ఈ అంశంపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, ఆయన తల్లి మల్లిక దీనిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మల్లిక తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, తన కుమారుడిపై అన్యాయంగా నిందలు వేస్తున్నారని, ఆయనను బలిపశువుగా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నిర్మాణంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని, పృథ్వీరాజ్ ఈ చిత్రానికి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. సినిమా స్క్రిప్ట్ను ముందుగా అందరూ ఆమోదించినప్పటికీ, ఇప్పుడు ఒక్క పృథ్వీరాజ్పైనే దుష్ప్రచారం చేయడం అన్యాయం అని మల్లిక పేర్కొన్నారు.
ఈ చిత్రంలో విలన్ పాత్రను హిందుత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించడం, అతడు జాతీయ స్థాయిలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదిగినట్లు చూపించడం వివాదాస్పదంగా మారింది. అంతేకాదు, ఆ పాత్రను గుజరాత్కు చెందిన వ్యక్తిగా చూపించడంతో, కొన్ని రాజకీయ వర్గాలు ఈ అంశంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కారణంగా, కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు దర్శకుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. చిత్ర యూనిట్ నుంచి అధికారిక స్పందన వచ్చే వరకు, ఈ విషయంపై మరింత చర్చ కొనసాగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Recent Random Post:















