కాంతారాతో రుక్మిణి వసంత్ పాన్ ఇండియా క్రేజ్

Share


చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటీమణుల్లో రుక్మిణి వసంత్ ఒకరు. 2024లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, మొదట్లో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ ప్రాజెక్టులో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారని వార్తలు వెలువడినప్పటి నుంచి ఆమె పేరు విపరీతంగా ట్రెండ్ అయ్యింది. అదే సమయంలో శివ కార్తికేయన్ నటించిన మదరాసి సినిమాలో కూడా ఆమె నటించడంతో దక్షిణాది సినీ వర్గాల్లో మరింత గుర్తింపు పొందింది.

ఈ రెండు ప్రారంభ చిత్రాలు పెద్దగా విజయాన్ని అందించకపోయినా, రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ వన్ ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. మొదట సాదాసీదాగా కనిపిస్తూ చివరికి శక్తివంతమైన పాత్రలో మెరిసిన ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొన్ని సన్నివేశాల్లో రిషబ్ శెట్టికి సమానంగా లేదా అతనిని మించి నటించారనే ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ ఒక్క సినిమాతోనే రుక్మిణి వసంత్‌కు పాన్ ఇండియా స్థాయి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రుక్మిణి వసంత్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ప్రముఖ మ్యానిఫెస్టో మ్యాగజైన్ కవర్ పేజీ కోసం చేసిన ఫోటోషూట్ ఫ్యాషన్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. గులాబీ రంగు సీక్విన్ డ్రెస్‌లో సంప్రదాయ బంగారు హెయిర్ యాక్సెసరీస్‌తో ఆమె దేవకన్యలా కనిపించారు. మరో ఫోటోలో ఆలివ్ గ్రీన్ డ్రెస్‌లో బంగారు ఆభరణాలతో స్టైలిష్‌గా ఫోజులిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.

కన్నడ కుటుంబంలో 1994 డిసెంబర్ 10న జన్మించిన రుక్మిణి వసంత్, తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ గారి స్ఫూర్తితో పెరిగారు. ఆయన అశోక చక్ర అవార్డు పొందిన తొలి కర్ణాటక సైనిక అధికారి కావడం విశేషం. అలాగే, రుక్మిణి లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్‌లో నటనలో శిక్షణ పొందారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో వేగంగా ఎదుగుతున్న నటీమణుల్లో ఆమె ఒకరిగా నిలుస్తున్నారు.


Recent Random Post: