
ఏపీలో టీడీపీ-బీజేపీ మధ్య సఖ్యత బాగానే ఉన్నప్పటికీ, కొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూటమి సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు చెందిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపాయి. బీజేపీ నేతలపై ఆయన చేసిన విమర్శలు తీవ్ర చర్చకు దారితీశాయి.
జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేత, నటి మాధవీలతపై విమర్శలు చేయడంతో వివాదం తీవ్రతరమైంది. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేత మరియు మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా స్పందించి, జేసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అయితే, వివాదం సీరియస్ అవుతుండటంతో జేసీ తక్షణమే తన తప్పును అంగీకరించి క్షమాపణలు తెలిపారు.
ఆదివారం మీడియాతో మాట్లాడిన జేసీ, “మాధవీలతపై నేను టంగ్ స్లిప్ అయ్యాను. నా మాటలు సరికావు. అందుకు క్షమాపణలు చెబుతున్నా,” అని స్పష్టం చేశారు. తాడిపత్రి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కృషి చేస్తూ, ప్రజలే తన బలమని జేసీ చెప్పారు. తనకు ఎవరి పట్ల వ్యక్తిగత విద్వేషాలు లేవని స్పష్టం చేశారు.
పార్టీ మారుతున్నారని వస్తున్న పుకార్లను ఖండిస్తూ, “చంద్రబాబు ఎంతో కష్టపడి టీడీపీని నిలబెట్టారు. ఆయన వెంటే నేను ఉంటా,” అని చెప్పారు. జేసీ క్షమాపణలతో వివాదం సద్దుమణిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఘటన, కూటమి నేతలు పరస్పర అవగాహనతో పని చేయాల్సిన అవసరాన్ని మరింత చాటిచెప్పింది.
