టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోటప్పకొండ వద్ద ప్రమాణం చేయడానికి వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకుని, హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. జీవీ ఆంజనేయులు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు ఎన్నారైల నుంచి నిధులు వస్తున్నాయంటూ వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తాను నిర్వహిస్తున్నస్వచ్ఛంద సంస్థలకు ఎన్నారైల నుంచి నిధులు వస్తున్న విషయం నిరూపించాలని బ్రహ్మనాయుడికి జీవీ ఆంజనేయులు సవాల్ చేశారు. ఈ విషయంలో తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి కోటప్పకొండ వద్ద ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం అక్కడకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ దశలో పోలీసులు వచ్చి ఆయన్ను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. తాను నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నానని.. వెళ్లకుండా ఆపే అధికారం మీకు లేదంటూ పోలీసులపై మండిపడ్డారు. చివరకు పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.
Posted inTelugu - Featured Telugu - Political News
