పంచాయితీ పోరులో జనసేన ‘మూడో లెక్క’ ఎంత.?

పంచాయితీ ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. అసలు జనసేన తరఫున బరిలో ఎవరైనా నిలబడతారా.? అలాంటి అవకాశం అధికార వైసీపీ ఇస్తుందా.? ఏకగ్రీవాల మాటున అధికార పార్టీలు నడిపే రాజకీయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకే దిక్కుండదు గనుక.. జనసేన గురించి ఆలోచించడం దండగ.. అన్న విశ్లేషణల నడుమ, ‘జనసేన పార్టీ సత్తా చాటింది’ అని పచ్చ అలాగే బులుగు మీడియా సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తొలి దశ పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ 18 శాతం ఓటు బ్యాంకుని కైవసం చేసుకుని అందర్నీ విస్మయానికి గురిచేసింది. రెండో దశ ఎన్నికల్లో జనసేనకు ఏకంగా 22 శాతం ఓటు బ్యాంకు లభించింది.

అయితే, పంచాయితీ ఎన్నికల్లో అభ్యర్థులు పార్టీ గుర్తుల మీద పోటీ చేయరు గనుక.. ఇటు అధికార వైసీపీ, అటు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. రెండూ కలిసి తప్పుడు లెక్కలు తమ తమ మీడియా సంస్థల ద్వారా చూపిస్తూ, జనసేన విజయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేశాయి. కానీ, జనసేన మద్దతుదారులు తాము గెలిచిన స్థానాల్లో చేసిన హంగామా కారణంగా బులుగు అలాగే పచ్చ మీడియా.. వాస్తవాల్ని ఒప్పుకోక తప్పడంలేదు. మూడో దశ పంచాయితీ ఎన్నికల కోసం కూడా జనసేన మద్దతుదారులు బారీగానే నామినేషన్లు వేశారు. మిత్రపక్షం బీజేపీ లైట్ తీసుకున్నగానీ, జనసేన పార్టీ శ్రేణులు తమ తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు ప్రచారాన్ని హోరెత్తించారు. గ్రామ స్థాయిలో జనసైనికులే పూర్తిగా బాధ్యత తీసుకున్నారు.

జనసైనికులు, జనసేన వీర మహిళలే పోటీ చేయడంతో, ప్రత్యర్థి పార్టీలకు బుకాయించే అవకాశం కూడా లేకపోయింది. పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఆయా గ్రామాల్లో పాలాభిషేకాలు జరుగుతున్నాయంటే.. ఈ విజయం ఎంతటి అపూర్వమైనదిగా ప్రజలు భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ‘మేం ఆశించినదానికంటే మెరుగైన ఫలితాలు వచ్చాయి.. ముందు ముందు మరిన్ని అద్భుతమైన ఫలితాల్ని సాధిస్తాం.. జనసైనికులు ఇంకా ధైర్యంగా ఎన్నికల్ని ఎదుర్కోవాలి..’ అంటూ అధినేత ఇచ్చిన పిలుపు, జనసైనికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.


Recent Random Post: