అంతగా క్రేజ్ లేని సినిమాలకు ఎలా బజ్ తెచ్చుకోవాలో బాలీవుడ్ దర్శక-నిర్మాతలకు బాగా తెలుసు. ఇప్పుడు అలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ జరుగుతోందా? అనే అనుమానాలు షాహిద్ కపూర్ నటిస్తున్న ‘అర్జున్ ఉస్తారా’ చిత్రాన్ని చుట్టుముట్టాయి.
గత కొన్ని వారాలుగా విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ఆగిపోయిందన్న పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ప్రేక్షకులు, షాహిద్ అభిమానులు “ప్రాజెక్ట్కి ఏమైంది?” అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కానీ చిత్రబృందం ఈ వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తోంది. ముంబైలోని బాంద్రా పరిసరాల్లో షూటింగ్ కొనసాగుతోందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతిరోజూ షూటింగులో పాల్గొంటున్నారని చెబుతున్నారు. “షూటింగ్ ఆగిపోతుందన్న వార్తలకి ఏమాత్రం నిజం లేదు” అని యూనిట్ స్పష్టంచేసింది.
అయితే, ఈ పుకార్లకు కారణం ఏంటి? ఏప్రిల్ ప్రారంభంలో ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించాల్సి ఉండగా, అందుకు అవసరమైన నృత్యకారులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ పాటను వాయిదా వేయాల్సి వచ్చింది. “మనం ఊహించిన లుక్, వైబ్ పనిచేయదు అనిపించింది కాబట్టి ఆలస్యం చేశాం” అని దర్శకుడు విశాల్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
‘అర్జున్ ఉస్తారా’ జనవరి 2025లో సెట్స్ మీదకు వెళ్లింది. అప్పటి నుంచి చిత్రీకరణ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. మిగతా పాటను చిత్రీకరించిన తర్వాత జూన్ చివరి నాటికి సినిమా ఫినిష్ అయ్యే అవకాశముంది.
అయితే, బజ్ తగ్గిపోతోందనో, క్రేజ్ పెంచుకోవాలనో తెలియదుగానీ — ఈ రూమర్ల ద్వారా ఎటో ఒక విధంగా సినిమాపై ఆసక్తి పెంచే ప్రయత్నం జరుగుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గ్యాంగ్స్టర్ నేపథ్యంతో మాస్ మసాలా కథను విశాల్ భరద్వాజ్ తెరకెక్కిస్తుండటంతో, షాహిద్ కపూర్కు ఇది మరో హిట్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి.
Recent Random Post: